Prithviraj Sukumaran: ‘సలార్‌’లో రెండేళ్ల కిందటే అవకాశం వచ్చింది.. కానీ!

ప్రభాస్‌(prabhas) కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌’(Salaar)లో నటించే అవకాశం రెండేళ్ల కిందటే వచ్చిందని మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌(Prithviraj Sukumaran) అన్నారు.

Updated : 25 Jun 2022 20:01 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌(prabhas) కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌’(Salaar)లో నటించే అవకాశం రెండేళ్ల కిందటే వచ్చిందని మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌(Prithviraj Sukumaran) తెలిపారు. కానీ, అనుకోని కారణాల వల్ల చేయలేకపోయానని తెలిపారు. దీనిపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పృథ్వీరాజ్‌ కథానాయకుడిగా షాజీ కైలాస్‌ తెరకెక్కించిన చిత్రం ‘కడువ’. శనివారం ఈ చిత్ర టీజర్‌ విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మాట్లాడారు.

‘తెలుగులోనే నేరుగా సినిమా ఎప్పుడు చేస్తారు’ అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ..  ‘‘త్వరలోనే ఆ విషయం మీకు చెబుతా. తెలుగు చిత్రాన్ని చేయాలని నేనూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. షూటింగ్‌ డేట్స్‌ విషయంలో ఇంకా కసరత్తు జరుగుతోంది. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘సలార్‌’లో ఓ ముఖ్య పాత్ర చేయమని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ రెండేళ్ల కిందటే అడిగారు. అప్పుడే నాకు కథ కూడా వినిపించారు. నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా అద్భుతంగా ఉంది. నేను కూడా సినిమా చేయడానికి ఓకే చెప్పాను. ఎందుకంటే ప్రశాంత్‌, హోంబాలే ఫిల్మ్స్‌ నిర్మాతలు నాకు స్నేహితులు. అంతకుమించి అది ప్రభాస్‌ సినిమా. అతనితో నటించాలని నాకూ ఉంది. కానీ, కరోనా కారణంగా మలయాళంలో నా సినిమాలకు సంబంధించిన డేట్స్‌ అన్నీ మారిపోయాయి. దీంతో సినిమా చేయలేనని ప్రశాంత్‌కు చెప్పా. అయితే, అదే కరోనా కారణంగా ప్రభాస్‌ సినిమా డేట్స్‌ విషయంలో కూడా మార్పులు జరిగాయి. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అన్నీ కుదిరితే నేను ‘సలార్‌’ భాగస్వామిని అవుతా. శనివారం రాత్రి ప్రశాంత్‌నీల్‌ను కలుస్తా. అతనితో మాట్లాడిన తర్వాత నేను నటించే విషయమై స్పష్టత వస్తుంది. తప్పకుండా తెలుగు సినిమా చేస్తా. అంతేకాదు, దర్శకత్వం చేసే అవకాశం కూడా ఉంది. కొన్ని నిర్మాణ సంస్థలు తెలుగు సినిమాకు దర్శకత్వం వహించమని నన్ను సంప్రదించాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇతర ఇండస్ట్రీలకు తెలుగు సినిమా ఇండస్ట్రీ బిజినెస్‌ మోడల్‌లా నిలిచింది’’ అని అన్నారు.

‘మీరు ఒక తెలుగు సినిమాకు దర్శకత్వం వహించాలంటే ఏ హీరో మూవీని డైరెక్ట్‌ చేస్తారు’ అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ‘హీరోలను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయను. స్క్రిప్ట్‌ డిమాండ్‌ను బట్టి దర్శకత్వం వహిస్తా. అందులోని పాత్రకు ఎవరు సరిగ్గా సరిపోతారో వారితోనే సినిమా చేస్తా. అయితే, చిరంజీవి సర్‌ ‘గాడ్‌ ఫాదర్‌’ చేయటం చాలా సంతోషంగా ఉంది. ‘లూసిఫర్‌’ తర్వాత దాని తెలుగు వెర్షన్‌ తీయాలనుకున్నప్పుడు నా మొదటి ఛాయిస్‌ చిరంజీవిగారే. ఇదే విషయాన్ని ఆయనకూ చెప్పా. అయితే నాకున్న కమిట్‌మెంట్స్‌ కారణంగా సినిమా చేయడానికి కుదరలేదు. ఇప్పుడు ఆ సినిమాను ఆయన చేయడం సంతోషంగా ఉంది. భవిష్యత్‌లో అవకాశం వస్తే తప్పకుండా చిరంజీవిగారితో కలిసి నటిస్తా. ‘సైరా’లో ఓ పాత్ర చేయమని ఆయన నన్ను అడిగారు. కానీ, నేను అప్పుడు ఓ సినిమా షూటింగ్‌ కోసం విదేశాలకు వెళ్లా. మరొక విషయం ఏంటంటే.. ఇప్పటికీ ఆ సినిమా షూటింగ్‌ పూర్తి కాలేదు. అదే ‘ఆడుజీవితం’(నవ్వులు)’’ అని పృథ్వీరాజ్‌ చెప్పుకొచ్చారు. ఇక పృథ్వీరాజ్‌ నటించిన ‘కడువా’ (Kaduva)జూన్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ కీలక పాత్రలో పోషించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని