Azadi ka amrit mahotsav: 75 ఏళ్లు 75 ఘట్టాలు: ఏ రోజు ఏం జరిగింది?

75 ఏళ్లలో భారత్‌ సాధించిన విజయాలు, దేశంలో జరిగిన ముఖ్య ఘట్టాల సమాహారం

Updated : 15 Aug 2022 13:56 IST

  • 1947 ఆగస్టు 15న బ్రిటీష్ పాలకుల నుంచి భారత్‌ స్వాతంత్ర్యం పొందింది. ఒక్కరోజు ముందు పాక్‌ వేరుపడింది.
  • 1947-48 మధ్య కాలంలో కశ్మీర్‌ ప్రాంతం కోసం భారత్‌- పాక్‌ మధ్య తొలి యుద్ధం జరిగింది. స్వతంత్ర రాజ్యంగా ఉన్న జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు మహరాజా హరిసింగ్‌ భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంతో వివాదం ముగిసింది.
  • 1951లో రైల్వే లైన్లను జాతీయీకరించారు. అప్పట్లో మూడు జోన్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 1,19,630 కిలోమీటర్ల పొడవైన రైలుమార్గాలు, 7,216 స్టేషన్లతో ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌గా అవతరించింది.
  • 1951లో దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 489 స్థానాలకు గానూ 364 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. జవహర్‌లాల్‌ నెహ్రూ తొలి ప్రధానిగా ఎన్నికయ్యారు.
  • ఆసియాలోనే తొలి న్యూక్లియర్‌ రియాక్టర్‌ను 1956 ఆగస్టు 4న భారత్‌ ప్రారంభించింది.
  • మెహబూబ్‌ ఖాన్‌ దర్శకత్వంలో వచ్చిన మదర్‌ ఇండియా చిత్రానికి 1958లో ఆస్కార్‌ అవార్డు వరించింది. విదేశీ భాషా చిత్ర విభాగంలో ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.
  • విశాల భారతదేశం సాధించిన తొలి విజయం హరిత విప్లవం. 1960లో గోధుమలు, పప్పుధాన్యాల్లో కొత్త రకాల వంగడాల అభివృద్ధితో అధిక దిగుబడులను భారత్‌ సాధించగలిగింది. మిగులు ఆహార ధాన్యాలు సాధించడానికి ఈ విప్లవం దోహదపడింది.
  • భారత్‌ చైనా యుద్ధం: సరిహద్దు విషయమై భారత్‌- చైనా మధ్య తొలిసారి 1962లో యుద్ధం జరిగింది. మెక్‌మోహన్‌ రేఖ, వాస్తవాధీన రేఖను చైనా అంగీకరించకపోవడంతో యుద్ధం తలెత్తింది. కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్ధం ముగిసింది.
  • 14 బ్యాంకులను భారత ప్రభుత్వం 1969 జులై 19న జాతీయీకరించింది. 1980 ఏప్రిల్‌లో మరో దఫా బ్యాంకుల జాతీయీకరణ జరిగింది.
  • పాల కొరత ఉన్న దేశాన్ని పాల ఉత్పత్తిదారుల దేశంగా మార్చింది శ్వేత విప్లవం. 1970లో డెయిరీల అభివృద్ధి ద్వారా వర్ఘీస్‌ కురియన్‌ ఈ విప్లవానికి శ్రీకారం చుట్టారు.

  • భారత్‌ నుంచి విడిపోయిన పాకిస్థాన్‌ ఆ తర్వాత మరో రెండు ముక్కలైంది. పాకిస్థాన్‌ నుంచి స్వాతంత్ర్యం కోరుతూ తూర్పు పాకిస్థాన్‌లోని ముజిబుర్‌ రెహమాన్‌ నాయకత్వంలో సాగించిన పోరాటం 1971 మార్చి 26న సాకారమైంది. బంగ్లాదేశ్‌గా అవతరించింది.
  • రెండు దేశాల మధ్య ఉన్న వివాదాలను శాంతియుతంగా, ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు భారత్‌-పాక్‌ మధ్య 1972లో సిమ్లా ఒప్పందం కుదిరింది.
  • అడవుల సంరక్షణ కోసం భారత్‌లో జరిగిన అతిపెద్ద ఉద్యమం చిప్కో మూమెంట్‌. 1973లో ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా రేనీ గ్రామంలో ఇది ప్రారంభమైంది.
  • పోఖ్రాన్‌-1: 1974లో భారత్‌ తొలిసారి తొలిసారి అణుపరీక్షలను నిర్వహించింది. దీంతో అణ్వాయుధాలు కలిగిన దేశాల జాబితాలో భారత్‌ చేరింది.
  • స్వాతంత్ర్యం అనంతరం అవినీతి, దుష్పరిపాలనకు వ్యతిరేకంగా బిహార్‌లో సామాజిక కార్యకర్త జయప్రకాశ్‌ నారాయణ నేతృత్వంలో 1974లో ఉద్యమం జరిగింది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో దీంట్లో పాల్గొన్నారు.
  • 1975లో భారత్‌ తొలిసారి అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపించింది. ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట పేరునే దీనికి పెట్టారు.

  • ప్రజాస్వామ్య భారతంలో చీకటి రోజులుగా వ్యవహరించే ఎమర్జెన్సీ 1975-77 మధ్య అమల్లోకి వచ్చింది. అత్యయిక స్థితి ద్వారా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పౌర హక్కులను కాలరాశారన్న అపకీర్తిని మూటగట్టుకున్నారు.
  • జనాభా నియంత్రణకు 1976లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను చేపట్టారు. ఎమర్జెన్సీ అమల్లో ఉన్న రోజుల్లోనే ఇందిరాగాంధీ తనయుడు, ఎంపీ సంజయ్‌ గాంధీ నేతృత్వంలో జరిగింది. ఒక్క ఏడాదిలో సుమారు 62 లక్షల మంది పురుషులకు బలవంతపు కు.ని. ఆపరేషన్లు జరిగాయి. చికిత్సలు వికటించి సుమారు 2వేల మంది వరకు చనిపోయారని అంచనా.
  • స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం జనతాపార్టీ సారథ్యంలో 1977లో ఏర్పాటైంది. ఎమర్జెన్సీకి కాంగ్రెస్‌ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మొరార్జీ దేశాయ్‌ తొలి కాంగ్రెసేతర ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
  • సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించేందుకు 1979లో మండల్‌ కమిషన్‌ ఏర్పాటైంది.

  • 1983లో కపిల్‌దేవ్‌ సారథ్యంలోని భారత జట్టు తొలిసారి క్రికెట్‌లో ప్రపంచకప్‌ను ముద్దాడింది.
  • సోవియట్‌ యూనియన్‌తో కలిసి భారత్‌ 1984లో అంతరిక్ష యాత్ర నిర్వహించింది. భారత్‌కు చెందిన వ్యోమగామి రాకేశ్‌ శర్మ అంతరిక్షంలోకి అడుగుపెట్టారు.
  • జర్నైల్‌ సింగ్‌ బింద్రన్‌ వాలే, అతడి అనుచరులను మట్టుబెట్టేందుకు 1984లో కేంద్రం చేపట్టిన మిలిటరీ చర్య ఆపరేషన్‌ బ్లూస్టార్‌. పంజాబ్‌ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో ఈ ఘటన జరిగింది.
  • ఇందిరా గాంధీ మరణం: సిక్కులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో 1984 అక్టోబర్‌ 31న ప్రధాని ఇందిరా గాంధీని ఆమెకు భద్రతగా వ్యవహరిస్తున్న సిక్కు అంగరక్షకులు కాల్చి చంపారు. 
  • ఇందిరా గాంధీ మరణం అనంతరం దేశంలో సిక్కుల ఊచకోత జరిగింది. సుమారు 3 వేల మంది ఈ ఘటనలో మరణించి ఉంటారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
  • 1984 డిసెంబర్‌ 3న మధ్యప్రదేశ్‌ భోపాల్‌లోని యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో సుమారు 3వేల మంది మరణించారు.
  • షాబానో కేసు (1985): దేశ చరిత్రలో చెప్పుకోదగ్గ తీర్పు ఇది. భరణాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించింది. తీర్పు అమలు కాకుండా అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది.
  • బోఫోర్స్‌ కుంభకోణం: స్వతంత్ర భారతంలో వెలుగుచూసిన పెద్ద కుంభకోణం. శతఘ్నుల కొనుగోలు వ్యవహారంలో అవినీతి చోటు చేసుకుందన్నది ఆరోపణ. ఈ అవినీతి ఆరోపణల వల్లే 1989 ఎన్నికల్లో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
  • 1987లో తొలిసారి ఇంగ్లాండ్‌ వెలుపల క్రికెట్‌ ప్రపంచకప్‌ టోర్నీ జరిగింది. భారత్‌-పాక్‌ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. ఆస్ట్రేలియా జట్టు ట్రోఫీ కైవసం చేసుకుంది.
  • ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు ఉద్దేశించిన మండల్‌ కమిషన్‌ సిఫార్సుల అమలుకు వ్యతిరేకంగా 1990లో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.

  • 1990లో కువైట్‌పై ఇరాక్‌ దాడి చేసింది. దీంతో కువైట్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించారు. ఆగస్టు 13 నుంచి అక్టోబర్‌20 వరకు జరిగిన ఎయిర్‌లిఫ్ట్‌లో ఎయిరిండియా సుమారు లక్షా 75 వేలమందిని తరలించింది.
  • 1991లో ఆర్థిక సంస్కరణలకు భారత్‌ శ్రీకారం చుట్టింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి దారులు తెరిచింది.
  • రాజీవ్‌ గాంధీ హత్య: 1991 మే 21న లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్ ఈలం ఉగ్రవాది థాను చేతిలో భారత ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్యకు గురయ్యారు. తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో ఈ ఘటన జరిగింది.
  • బాబ్రీ మసీదు కూల్చివేత: 1992 డిసెంబర్‌ 6న యూపీలోని అయోధ్యలో కరసేవకులు బాబ్రీమసీదును కూల్చివేశారు. అనంతరం దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగాయి. సుమారు 2వేల మంది మరణించారు.
  • భారత స్టాక్‌ మార్కెట్‌లో 1992లో సెక్యూరిటీస్‌ స్కామ్‌ వెలుగు చూసింది. లొసుగులను ఉపయోగించుకుని స్టాక్‌ బ్రోకర్‌ హర్షద్‌ మెహతా మోసానికి పాల్పడ్డాడు. భారత్‌ స్టాక్‌ మార్కెట్‌పై పడిన తొలి మరక ఇదీ.
  • 1993లో ఆర్థిక రాజధాని బొంబాయిలో పేలుళ్లు జరిగాయి. గ్యాంగ్‌స్టర్‌ దావూద్‌ ఇబ్రహీం సూత్రధారి. ఈ పేలుళ్లలో 250 మంది మరణించారు.
  • 1998లో అటల్‌ బిహారీ వాజ్‌పేయీ నేతృత్వంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటైంది. ఏడాదికే ఈ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఆ తర్వాత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయంతో మరోసారి అధికారంలోకి వచ్చింది.
  • ‘ఆపరేషన్‌ శక్తి’ పేరిట 1998 మార్చిలో రెండో దశ పోఖ్రాన్‌ అణు పరీక్షలను భారత్‌ చేపట్టింది. పూర్తిస్థాయి అణ్వాయుధాలు కలిగిన దేశంగా భారత్‌ అవతరించింది. 
  • 1999 ఫిబ్రవరి 19న పాకిస్థాన్‌లోని లాహోర్‌కు దిల్లీ నుంచి తొలి బస్సు సర్వీసు ప్రారంభమైంది. ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


  • నియంత్రణ రేఖను దాటి భారత్‌లోకి వచ్చిన పాకిస్థాన్‌ భద్రతా బలగాలను తిప్పికొట్టేందుకు భారత్‌ ‘ఆపరేషన్‌ విజయ్’ను ప్రారంభించింది. 1999లో జరిగిన ఈ యుద్ధాన్నే కార్గిల్‌ వార్‌గా పిలుస్తారు.
  • 1999 డిసెంబర్‌ 24న నేపాల్‌ నుంచి దిల్లీ వస్తున్న ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని ఐదుగురు పాకిస్థానీ హైజాకర్లు హైజాక్‌ చేశారు. 180 ప్రయాణికులు అందులో ఉన్నారు. బందీలుగా ఉన్న ప్రయాణికులను వదిలిపెట్టేందుకుగానూ ముగ్గురు ఉగ్రవాదులను భారత్‌ విడుదల చేయాల్సి వచ్చింది.
  • అనధికారికంగా అణ్వాయుధాలను వాడకూడదన్న ఒప్పందంపై భారత్‌-పాక్‌ మధ్య ఒప్పందం కుదిరింది. దీన్నే లాహోర్‌ డిక్లరేషన్‌గా పిలుస్తారు.
  • 2000వ సంవత్సరంలో భారత్‌కు క్రికెట్‌ జట్టుకు చెందిన అజారుద్దీన్‌, అజయ్‌ జడేజాలపై మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చాయి. 
  • 2000 నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాలు ఏర్పాడ్డాయి. దీంతో దేశంలో రాష్ట్రాల సంఖ్య 25 నుంచి 28కి పెరిగింది.

  • 2001లో వాజ్‌పేయీ ప్రభుత్వం దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాను కలుపుతూ జాతీయ రహదారుల విస్తరణ కోసం స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్‌గాను ప్రారంభించింది.
  • గుజరాత్‌లోని గోద్రాలో 2002 ఫిబ్రవరి 27న రైలు భోగీని తగలబెట్టిన ఘటన అనంతరం పెద్ద ఎత్తున మత ఘర్షణలు చెలరేగాయి. ఈ అల్లర్లలో వెయ్యి మందికి పైగా మరణించారని లెక్కలు చెబుతున్నాయి.
  • 2005లో సమాచార హక్కు చట్టాన్ని యూపీఏ-1 ప్రభుత్వం తీసుకొచ్చింది.
  • గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏడాదిలో 100 రోజులు పని కల్పించే ఉద్దేశంతో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. యూపీఏ-1 ప్రభుత్వం 2005లో దీన్ని తీసుకొచ్చింది.
  • 2004లో హిందూ మహా సముద్రంలో సునామీ వచ్చింది. రాకాసి కెరటాలకు సుమారు 10వేల మంది బలయ్యారు.
  • భారత తొలి మహిళా రాష్ట్రపతిగా మహారాష్ట్రకు చెందిన ప్రతిభా పాటిల్‌ 2007లో పదవిని అలంకరించారు. ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగారు. 

  • చంద్రయాన్‌-1: చంద్రుడిపై పరిశోధనల కోసం ఈ ప్రాజెక్ట్‌ను 2008 అక్టోబర్‌లో భారత్‌ చేపట్టింది.
  • 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో అభినవ్‌ బింద్రా ఎయిర్‌ రైఫిల్‌లో స్వర్ణం గెలుచుకున్నాడు. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి వ్యక్తిగా రికార్డులకెక్కాడు.
  • చిన్నారులందరికీ చదువును ప్రాథమిక హక్కుగా చేరుస్తూ విద్యా హక్కు చట్టాన్ని 2009 కేంద్రం తీసుకొచ్చింది. దీని ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేదలకు కేటాయించాలి.
  • 2009లో జులై 26న దేశీయంగా రూపొందిన INS అరిహంత్‌ సబ్‌మెరైన్‌ అందుబాటులోకి వచ్చింది. భారత తొలి న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌ ఇదే.
  • 2010లో భారత్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో ఆస్ట్రేలియా తొలి స్థానంలో నిలవగా.. 101 పతకాలతో భారత్‌ రెండో స్థానం సాధించింది. ఈ క్రీడల నిర్వహణపై అవినీతి ఆరోపణలూ వచ్చాయి.

  • 2011 ఏప్రిల్‌ 2న మహేంద్ర సింగ్‌ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు రెండోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో శ్రీలంకపై విజయం సాధించింది. 
  • అవినీతికి వ్యతిరేకంగా లోక్‌పాల్‌ బిల్లు కోరుతూ 2011లో అన్నాహజారే నిరసన చేపట్టారు. 2013లో పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందింది.
  • 2012లో జరిగిన నిర్భయ అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. దీంతో అత్యాచారం వంటి కేసుల్లో కఠిన శిక్షలు అమలు చేసేందుకు 2013లో నిర్భయ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది. 
  • మూడింట రెండొంతుల మంది భారతీయులకు ఆహార భద్రతను కల్పించేందుకు జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013ను పార్లమెంట్‌ ఆమోదించింది.
  • దేశాన్ని పట్టి పీడించిన పోలియో మహమ్మారి పీడ విరగడైంది. 2014లో ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో అధికారికంగా ప్రకటించింది.

  • 2014 జూన్‌ 2 తెలంగాణ రాష్ట్రం అవతరించింది.
  • దేశీయంగా అభివృద్ధి చేసిన సొంత నావిగేషన్‌ సిస్టమ్‌ నావిక్‌ ప్రారంభమైంది.
  • 2016లో మోదీ సర్కారు రూ.1000, రూ.500 నోట్లు రద్దు చేసింది.
  • పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు 2016 సెప్టెంబర్‌ 29న భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించింది. 35-70 మంది ఉగ్రవాదులు మరణించి ఉంటారని కేంద్రం పేర్కొంది. 
  • 2017 జులై 1 నుంచి వస్తు, సేవల పన్ను (GST) అమల్లోకి వచ్చింది.

​​​​​​​

  • ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు 2017లో కీలక తీర్పు వెలువరించింది.
  • స్వలింగ సంపర్కంపై 2018లో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సెక్షన్‌ 377 కింద స్వలింగ సంపర్కం నేరం కాదని పేర్కొంది. 
  • కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలను ప్రవేశం కల్పిస్తూ 2018 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అన్ని వయసులవారికీ ప్రవేశం కల్పించాలని సూచించింది.
  • అయోధ్య భూవివాదం విషయంలో 2019లో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అప్పటి సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం రామ మందిర నిర్మాణానికి భూమిని కేటాయించింది.
  • 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడులకు ప్రతిగా.. అదే నెల 26న బాలాకోట్‌ ఉగ్రస్థావరాలపై భారత్‌ దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో మన దేశ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పాక్‌ సైన్యానికి చిక్కారు. అనంతరం పాక్‌ ఆయనను భారత్‌కు అప్పగించింది.

  • చంద్రయాన్‌-2: చంద్రుడిపై పరిశోధనలకు ఇస్రో చేపట్టిన రెండో యాత్ర ఇది. 2019 జులై 22న దీన్ని చేపట్టింది. చివరి నిమిషంలో సాఫ్ట్‌ల్యాండింగ్‌ విఫలమైననప్పటికీ.. చందమామ చుట్టూ ఆర్బిటర్‌ విజయవంతంగా పరిభ్రమిస్తోంది.
  • ఆర్టికల్‌ 370 కింద జమ్మూకశ్మీర్‌కున్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేసే బిల్లుకు 2019 ఆగస్టు 6న పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. దీంతో జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి.

​​​​​​​

  • 2020లో దేశంలోకి కొవిడ్‌ మహమ్మారి ప్రవేశించింది. దీంతో దేశవ్యాప్తంగా మార్చి 24న లాక్‌డౌన్‌ విధించారు. విమానాలు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
  • రైతు చట్టాలు: కేంద్రం తెచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో సుప్రీంకోర్టు వీటి అమలును నిలిపివేసింది. 2021 డిసెంబర్‌ 1న వీటిని వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించింది. 
  • ​​​​​​​ఒడిశాకు చెందిన ఆదివాసీ మహిళానేత ద్రౌపది మర్ము భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు.

​​​​​​​​​​​​​​

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని